కలెక్టర్ ప్రావీణ్య
న్యాల్కల్(జహీరాబాద్): నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ జోన్(నిమ్జ్) ప్రాంతంలో చేపట్టిన జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. మండల పరిధిలోని బర్దీపూర్, చిల్లపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి గ్రామ శివారులో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించిన భూమిలో ఎంతవరకు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని, ఇతర పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మొదటిదశలో సేకరించిన 3,245 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వెంటనే అప్పగించాలని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా చేపట్టిన సర్వే పూర్తి కాగానే ఫెన్సింగ్ క్లియరెనన్స్ చేయాలని ఆదేశించారు. భూమి చదును చేసే ప్రక్రియ సైతం పూర్తి కావాలన్నారు. రహదారుల లొకేషన్ ఖరారు చేసి, విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, తహసీల్దార్ భాస్కర్, ఎస్ఐ క్రాంతికుమార్ పాటిల్, మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


