ధర్మం గెలిచింది | - | Sakshi
Sakshi News home page

ధర్మం గెలిచింది

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

కాళేశ్వరం హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి హైకోర్టు వెలువరించిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌రావులు నైతిక విజయం సాధించారని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌పై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం బాగుకోసం రేయింబవళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారన్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ పార్టీ ముఖ్య నేతలను ఘోష్‌ కమిషన్‌ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జి.గుండప్ప, బీఆర్‌ఎస్‌ నాయకులు తట్టు నారాయణ, నర్సింహులు, బండి మోహన్‌, యాకూబ్‌, గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement