పారిశుద్ధ్య నిర్వహణ పక్కా | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య నిర్వహణ పక్కా

Jun 20 2025 6:53 AM | Updated on Jun 20 2025 6:53 AM

పారిశుద్ధ్య నిర్వహణ పక్కా

పారిశుద్ధ్య నిర్వహణ పక్కా

వంద రోజుల ప్రణాళికకు రూపకల్పన

నారాయణఖేడ్‌: వానాకాలం..వ్యాధుల కాలం కావడంతో పట్టణాల ప్రజలు అనారోగ్యాలకు దూరంగా ఉంటూ స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వందరోజుల ప్రణాళికకు రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం ఏదోఒక కార్యక్రమంతో అధికారులు, సిబ్బంది ప్రజల్లో ఉంటూ అవగాహన కల్పిస్తూ అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. జూన్‌ 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 10వరకు వంద రోజులపాటు కొనసాగనుంది. సంపూర్ణ పారిశుద్ధ్యం, తాగునీరు, నీటి క్లోరినేషన్‌, నీటి పరీక్షలు, ముంపు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, గృహాల స్థాయిల్లోనే తడి, పొడి చెత్త వేరు చేయడం, కాలనీ వాసులు కమ్యూనిటీ కంపోస్టు తయారు చేసుకునేలా అవగాహన కల్పించడం, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మున్సిపాలిటీ ద్వారా తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంది. దోమల నివారణకు ఫాగింగ్‌, గుంతలు పూడ్చడం, విద్యుత్‌ సమస్యలు నివారించడం వంటివి ఈ కార్యక్రమాల్లో చేపడతారు.

ముమ్మరంగా కార్యక్రమాలు

జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో అమలు

రోజుకో కార్యక్రమం, ప్రజలకు అవగాహన

వెంటాడుతున్న నిధుల సమస్య

ఆదాయం సమకూర్చుకుంటూనే..

మున్సిపాలిటీకి పాలకవర్గాలు లేకపోవడం, సాధారణ నిధులు తప్ప ఆర్థిక సంఘం నిధులు వెసులుబాటు లేకపోవడంతో నిధుల సమస్య ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని ఈ కార్యక్రమంలోనే అధిగమించేలా ఏర్పాట్లు చేపట్టారు. తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేసుకున్న వాటిని భువన్‌ యాప్‌ ద్వారా సర్వే చేసి ట్యాక్స్‌ రివైజ్‌ చేయనున్నారు. లైసెన్సులేని దుకాణాలను గుర్తించి లైసెన్సును ఇప్పించనున్నారు. వీధి వ్యాపారులకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించడం, వన మహోత్సవం కింద మొక్కలు నాటడం, పరిశుభ్రత, ప్లాస్టిక్‌ నిర్మూలనపై వాల్‌పెయింటింగ్స్‌ ద్వారా అవగాహన కల్పించనున్నారు. పట్టణాల్లోని విద్యాసంస్థల విద్యార్థులతో పరిశుభ్రతా అంశాలపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందజేయనున్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న సిబ్బందితోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత మున్సిపాలిటీలతోపాటు రెండు నెలల క్రితం కొత్తగా ఏర్పాటైన గడ్డి పోతారం, కోహీర్‌, ఇస్నాపూర్‌, గుమ్మడిదల మున్సిపాలిటీల్లోనూ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement