
నత్తనడకన ‘అమృత భారత్’ పనులు
● జహీరాబాద్ రైల్వేస్టేషన్ సుందరీకరణకు రూ.24కోట్లు మంజూరు ● అధికారుల పర్యవేక్షణ లోపంతో ముందుకు సాగని వైనం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించిన ‘అమృత భారత్’పనులు అధికారుల పర్యవేక్షణ లోపంతో వేగం పుంజుకోవడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తికావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో సంబంధిత అధికారులను అడిగినా సమాధానం చెప్పలేకపోతున్నారు.
మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు
జహీరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, లాతూర్, విజయవాడ, షిర్డీ, సికింద్రాబాద్, హైదరాబాద్, వికారాబాద్, పూర్ణ, నాందేడ్, బెంగళూర్, బీదర్ తదితర ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉండగా ప్రతి రోజు వెయ్యి మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సుందరీకరణ పనులు కొనసాగుతుండటంతో ప్రస్తుతం స్టేషన్లో సదుపాయలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మౌలిక సదుపాయలైన సులభ్ కాంప్లెక్స్, తాగు నీటి సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో ప్లాట్ఫాం వైపు ఎలాంటి సౌకర్యాలు లేవు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్’స్టేషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లు దీర్ఘకాలిక ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంటారు. రాష్ట్రంలోని 39 స్టేషన్లను ఈ పథకం కింద చేర్చగా మొదటి దశలో 21 స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో జహీరాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఉంది. ఈ పథకం కింద జహీరాబాద్కు రూ.24.4 కోట్లను మంజూరు చేసి ప్రధాన మోదీ వర్చవల్గా గతేడాది ఆగస్టు 6న శంకుస్థాపన చేశారు.
ఆరంభ శూరత్వమే...
రైల్వేస్టేషన్లో ఒక ప్లాట్ ఫాం ఉండగా రెండవ ప్లాట్ఫాంను నిర్మించాల్సి ఉంది. మొదటి ప్లాట్ఫాంను కూడా విస్తరించాల్సి ఉంది. ఆధునిక టికెట్ కౌంటర్, మోడల్ షాపింగ్ మాల్, సులభ్ కాంప్లెక్స్ పనులతో పాటు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మొక్కల పెంపకం, గార్డెన్ నిర్మాణం పనులు చేపట్టాలి. రెండు బుకింగ్ కౌంటర్లు, తాగునీరు సౌకర్యం, కొత్తగా స్టేషన్ మాస్టర్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, మోడ్రన్ టాయిలెట్స్, ప్రధాన ద్వారం తదితర అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. గతేడాది దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కేకేబీ గుప్తా, అదనపు డివిజనల్ ఇంజనీర్ ఎల్.భిక్షపతి తదితరులు పనులను పర్యవేక్షించారు. అప్పటివరకు చురుగ్గా సాగిన పనులు ఆ తర్వాత బాగా నెమ్మదించాయి. రైల్వేశాఖ అధికారులు దృష్టి సారించి అమృత్ భారత్ పనులను త్వరగా పూర్తి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.