
వార్డు అధికారులు ఎక్కడ?
● తెల్లాపూర్ మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం ● పట్టించుకోని ఉన్నతాధికారులు
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడే అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. రోజుల తరబడి రోడ్ల పక్క చెత్త పేరుకుపోతోంది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మున్సిపల్ పరిధిలో పూర్తి స్థాయిలో వార్డు అధికారులు ఉండి కూడా సమస్యలను అపరిష్కృతంగా వదిలేయడమేమిటో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. వార్డు అధికారులకు పూర్తి బాధ్యతలు ఇచ్చినా వారు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో మున్సిపల్ పరిధిలో వార్డు అధికారులు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే వార్డు అధికారులు పూర్తి బాధ్యతలు నిర్వర్తించడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 17మందికిపైగా కిందస్థాయి అధికారులు ఖాళీగానే ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులతోపాటు సిబ్బందికి బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మ్యాన్పవర్ ద్వారా హాజరు తీసుకోవడం పలువురు అధికారులకు కలసి వస్తుందని చర్చించుకుంటున్నారు.
నిర్లక్ష్య ధోరణి వదులుకోవాలి
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. వందల కోట్ల నిధులను మంజూరు చేసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
–కొల్లూరి భరత్, మాజీ కౌన్సిలర్
చర్యలు తీసుకుంటాం
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం.
–చంద్రశేఖర్,
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)

వార్డు అధికారులు ఎక్కడ?

వార్డు అధికారులు ఎక్కడ?