
మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రాథమిక, ఉన్నత పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల నమోదు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి పాఠశాలను ప్రారంభించాలని స్పష్టం చేశారు. శ్మశాన వాటిక ఏర్పాటుకు భూమి కేటాయించడంపై తహసీల్దార్ సంగ్రామ్రెడ్డితో చర్చించారు. అందుకు సంబంధించిన ప్రాతిపాదనలు తయారు చేయాలన్నారు. వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్లాట్ యజమానులకు గృహజ్యోతి పథకం అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీడీపీఓ జయరాం, ఎంఈఓ పీపీ రాథోడ్, డీఈ సత్యనారయణ, ఏఈ మైనిక, మేనేజర్ అఖిల్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.