
ఆగస్టు 15కల్లా భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ పి.ప్రావీణ్య ● జిల్లాలో 12వేల దరఖాస్తులు
నారాయణఖేడ్: జిల్లా వ్యాప్తంగా రైతుల భూ సమస్యలకు సంబంధించి 12వేల దరఖాస్తులు అందాయని వాటన్నింటినీ ఆగస్టు 15 నాటికల్లా పరిష్కరిస్తామని కలెక్టర్ పి.ప్రావీణ్య హామీనిచ్చారు. భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నిజాంపేట్ మండలం రాంరెడ్డిపేట్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. అనంతరం రాంరెడ్డిపేట్ గ్రామంలో రేషన్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నాణ్యత, మూడునెలల బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇందిరమ్మ లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి భూమిపూజ నిర్వహించారు. నిజాంపేట్ గ్రామంలో ఎరువుల దుకాణం పరిశీలించి స్టాకు వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూ భారతిలో సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వారి సమస్యపై ఇరు పక్షాలను పిలిచి విచారించి న్యాయం చేస్తామన్నారు. బిల్లులు, పత్తి విత్తన ప్యాకెట్ల ట్యాగ్స్, స్టాక్ బోర్డు పరిశీలించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్ణీత ధరకు అందించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ రైతుల సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
నాణ్యమైన వంటకాలు అందించాలి
సంగారెడ్డి జోన్: వీధి విక్రయదారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలు మంచి వేదికగా నిలుస్తాయని, ఇందులో భాగంగా వినియోగదారులకు నాణ్యమైన వంటకాలు అందించాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ , మెప్మా ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంతనగర్ కాలనీలో వీధి విక్రయదారుల ఫుడ్ ఫెస్టివల్ను, అమ్మకం స్టాళ్లను కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సందర్శించారు.