
వాతావరణ మార్పులతోనే చెరుకుకు తెగుళ్లు
న్యాల్కల్(జహీరాబాద్): వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చెరుకు పంటకు తెగుళ్లు సోకి దెబ్బతింటుందని బసంత్పూర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించిన ఆయన చెరుకు పంటకు సోకిన మొవ్వు తెగుళ్లను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. మే, జూన్లో అధిక వర్షం కురవడం వల్ల్ల తెగుళ్లు ఉధృతి అధికంగా ఉంటుందని, 93వి 297, 3102 రకాలకు అధికంగా సోకుతాయన్నారు. ఈ రకాలను ఈ ప్రాంత రైతులు అధికంగా సాగు చేశారన్నారు. తెగుళ్లు సోకిన పంట ఆకుల మొదలు భాగం తెల్లగా మారి విప్పుకోకుండా చుట్టుకుపోతాయన్నారు. ఆకులు పాలిపోయి మొక్క ఎదుగుదల లేక చచ్చిపోతుందని, మొవ్వు తెగులు గాలి, వర్షం ద్వారా వ్యాప్తి చెందుతుందని వివరించారు. నివారణ కోసం అమీస్టార్ టాప్ 200 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలని, నాలుగు నుంచి ఏడు రోజుల తర్వాత బోరాన్ 200 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం కోరజెన్ 150మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే మొవ్వు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చని రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన
శాస్త్రవేత్త విజయ్కుమార్