
జనారణ్యంలోకి ‘చిరుత’
● బీబీపేటలో కాంపౌండ్వాల్లోకి దర్జాగా! ● రెండేళ్ల క్రితం ఖేడ్ డబుల్ బెడ్రూం ఇళ్ళల్లోకి.. ● కూలీలను వెంబడిస్తే.. తప్పించుకున్న కూలీలు ● తరచూ పశువులపై దాడి చేసి చంపేస్తున్న వైనం ● ప్రజల్లో నెలకొన్న భయాందోళన
నారాయణఖేడ్: నారాయణఖేడ్ అటవీశాఖ రేంజి పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఐదారేళ్లుగా చిరుత ఇక్కడ సంచరిస్తున్నా ఈ మధ్య మరీ ఎక్కువైంది. సిర్గాపూర్, కల్హేర్, నారాయణఖేడ్ మండలాలు ఒకే వరుసగా ఉండటం, ఈ మండలాల్లో అటవీ ప్రాంతం ఉండటంతో చిరుత సంచారానికి అనుకూలంగా మారింది. పదుల సంఖ్యలో లేగదూడలను చంపి తింటోంది. రెండు నెలల క్రితం సంజీవన్రావుపేట్ శివారులో లేగదూడలను చంపేసింది. తాజాగా కల్హేర్ మండం బీబీపేట గ్రామంలోని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు స్వప్న గుండు మోహన్ ఇంట్లోకి చొరబడింది. గుండు మోహన్ ఉదయం ఇంటి కాంపౌండ్కు గొళ్లెం వేసి బయటకు వెళ్లారు. కొద్దిసేపటికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సీసీటీవీని చూస్తుండగా కాంపౌండ్ వాల్లోపు చిరుత సంచరించడం చూశారు. సమాచారాన్ని భర్తకు చెప్పగా జాగ్రత్తుల సూచించిన గుండు మోహన్ ఇదే విషయాన్ని గ్రామస్తులకు చేరవేయడంతో భయాందోళనకు గురయ్యారు.
రెండేళ్ల క్రితం ఇలాగే...
రెండేళ్ల క్రితం ఖేడ్ మండలం జూకల్ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణ కూలీలను సైతం చిరుత వెంబడించింది. కూలీలు రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లగా దూరం నుంచి గమనించిన చిరుత కూలీలను తరిమింది. దీంతో కూలీలు నిర్మాణంలో ఉన్న డబుల్బెడ్రూం మూడో అంతస్థుకు చేరుకోగా అక్కడి వరకు కూడా చిరుత వెంబడించింది. దీంతో ఎలాగోలా స్లాబ్పైకి వెళ్లి చిరుత బారి నుంచి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పులి సంచరించిన అడుగులు నిర్మాణం ప్రాంతంలో అటవీశాఖ అధికారులు సేకరించారు.
మూగజీవాలు బలి
ఖేడ్, సిర్గాపూర్, కల్హేర్ మండలాల సరిహద్దుగా ఉన్న పలు గ్రామాల్లో అటవీప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీ ప్రాంతం గుండా చేలల్లోకి సమీపంలోని గ్రామాల్లోకి చిరుత చొరబడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దీని సంచారం కన్పిస్తోంది. ఆయా గ్రామాల్లో మూడేళ్ల కాలంలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో లేగదూడలను తినేసింది. సంజీవన్రావుపేట్ గ్రామంలో ఉమ్మాయి బుచ్చయ్య, అవుటి మొగులయ్య, పోశెట్టి, విఠల్, భూపాల్లకు చెందిన దూడలను చంపేసింది. కల్హేర్ మండలం బల్కంచెల్క తండాలో మూఢ్ దశరథ్కు చెందిన 25 గోర్రెల మందను తినేసింది. కడ్పల్, నాగ్ధర్ గ్రామాల్లో రెండు చొప్పున దూడలను హతమార్చింది. ర్యాకల్, రాపర్తి గ్రామాల శివార్లలోనూ లేగదూడలను చంపేసింది. సంజీవన్రావుపేట్, నాగ్ధర్, క్రిష్ణాపూర్, ఖాజాపూర్, అలికాన్పల్లి, బాచేపల్లి, సిర్గాపూర్, కడ్పల్, ర్యాకల్, రాపర్తి తదితర గ్రామాల శివార్లలో ఈ చిరుత సంచారం కన్పిస్తుంది. కల్హేర్, సిర్గాపూర్, ఖేడ్ మొదలుకుని న్యాల్కల్ వరకు పులి సంచారం జాడలు కన్పించాయి.
తల్లీ.. పిల్లలు!
బీబీపేట ప్రాంత సరిహద్దుల్లో చిరుత సంచారం ఉందంటూ అటవీశాఖ స్థానిక అధికారులకు మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చిరుతతోపాటు నాలుగు పిల్లలు ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.
బీబీపేటతోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం. పరిసర ప్రాంతాల్లోనూ దండోరా వేయిస్తాం. పరిసర ప్రాంత ప్రజలు తమ పశువులు, లేగదూడలను అటవీప్రాంతాల్లోని చేల వద్ద కాకుండా ఇళ్లల్లోని కొట్టాల్లో కట్టేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి.
– శ్రీధర్రావు, డీఎఫ్ఓ, మెదక్

జనారణ్యంలోకి ‘చిరుత’