
ప్రైవేట్ బడి.. ఆరా తప్పనిసరి!
ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోవద్దు
● పాఠశాల గురించి తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలి ● రిజిస్ట్రేషన్ గుర్తింపుపై ఆరా తీయాలి ● అర్హులైన టీచర్లు ఉన్నారో లేదో పరిశీలించాలి ● నిపుణుల సూచనలు
సదాశివపేట(సంగారెడ్డి): విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. ప్రస్తుతం బడులు ప్రారంభించినా ఆపడం లేదు. అయితే పాఠశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే చిన్నారులను చేర్పించాలని నిపుణులు సూచిస్తు న్నారు,
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాఠశాలలు
జిల్లాలో ఇప్పటికే 454 పైగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలుండగా ఈ విద్యాసంవత్సరంలో మరో 15 వరకు కొత్తగా ఏర్పాటైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజవర్గంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, పటాన్చెరు, జిల్లాలోని 12 మున్సిపాలిటీల, 26 మండలాల పరిధిలోనూ ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవని సమాచారం. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఆయా విద్యాసంస్థలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఫీజుల రూపంలో పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని మభ్యపెట్టి ముందుగా అడ్మిషన్లు చేశారు. వాస్తవానికి విద్యాశాఖ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తిస్థాయి అనుమతి తీసుకోవాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యాకమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి అనుమతులు కావాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా ప్రైవేటు విద్యాసంస్థలు ఇలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే తమ సంస్థల్లో విద్యార్థులను చేర్పించుకుని అనుమతులు లభించకపోతే పిల్లల్ని నట్టేట ముంచుతున్నాయి.
గుర్తింపు తప్పనిసరి
గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తుంది. ఇలాంటి విషయల్లో తల్లిదండ్రుల జాగురత అవసరం.
అనుమతులు లేకుంటే ఫిర్యాదు చేయండి
ప్రైవేట్ యాజమాన్యం ప్రారంభించే ప్రతీ పాఠశాల కూ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాఠశాలలు ప్రారంభిస్తే పూర్తి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి. –వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి

ప్రైవేట్ బడి.. ఆరా తప్పనిసరి!