
మరోసారి పొడిగించండి
● పదవీకాలం పొడిగింపుపై సర్కారును కోరనున్న డీసీసీబీ పాలకవర్గం ● ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీర్మానం! ● రూ.ఐదు వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తమ పదవీకాలాన్ని మరోసారి పొడిగించేలా ప్రభుత్వాన్ని కోరాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గం భావిస్తోంది. ఈ మేరకు సర్వ సభ్య సమావేశంలో ఈ అంశంపై పాలకవర్గం నేతలు ప్రత్యేకంగా చర్చించారు. ఈ పాలకవర్గం పొడిగించిన పదవీ కాలం గడువు ఆగస్టు 14తో ముగుస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే డీసీసీబీ జనరల్ బాడీ మీటింగ్ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తమ పదవీకాలం పొడిగింపు అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలు స్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 105 సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఈ సంఘాల నుంచి చైర్మన్, వైస్చైర్మన్లతోపాటు మరో 21 మంది డైరెక్టర్లు ఈ డీసీసీబీ పాలకవర్గంలో ఉన్నారు. అయితే వీరి పదవీ కాలం ఫిబ్రవరి 14తో ముగిసింది. అన్ని జిల్లాల డీసీసీబీల పాలకవర్గాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం వీరి పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఆగస్టు 14 వరకు వీరు పదవిలో కొనసాగుతారు. దీంతో మరో ఆరు నెలలు పొడిగించుకునేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని పాలకవర్గం నేతలు భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు చేస్తోంది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను రెండు నెలల్లో నిర్వహించాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. ఈ నేపథ్యంలో తమ పదవీకాలం పొడిగింపు ఉంటుందని పాలకవర్గం నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే..సహకార ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రూ. 2500 కోట్ల టర్నోవర్ చేరుకుని
రైతులకు పంట రుణాల మంజూరుతోపాటు, దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ బ్యాంకింగ్ సేవలు అందించడంతో డీసీసీబీది కీలక పాత్ర. ఇప్పటికే ఈ సహకార బ్యాంకు రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకున్న విషయం విదితమే. ఈ వార్షిక టర్నోవర్ను రూ.ఐదు వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాలకవర్గం నేతలు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో కొత్త రైతులకు రూ.50 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల ఆడిట్ రిపోర్టుకు ఈ సమావేశంలో పాలకవర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లు తమ కార్యాచరణను పెంచుకుని లాభాల బాట పట్టేలా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.