తుర్కయంజాల్: భవిష్యత్తు కోసం పోరాడుతున్న జెన్–జీ యువతను దిమాగీ నక్సల్స్గా ముద్ర వేయడం ప్రధాని మోదీ అసహనానికి నిదర్శనమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఆదిభట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలోని అరుణ కన్వెన్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన సంఘం జిల్లా 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వాల్సిన పాలకులు, వారిపై ముద్రలు వేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక, వ్యతిరేక విధానాలు, విద్యా, ఉపాధి రంగాలపై పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం యువత ఆశయాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. యువత ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కాకుండా సమాజాన్ని శాసీ్త్రయ దృక్పథంతో అర్ధం చేసుకునే సైద్ధాంతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు, సామిడి శేఖర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు తగిలి మధు, జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వంశీ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


