● దుస్తుల ఉత్పాదకతపై ప్రభావం
● నగరంలో 5 పరిశ్రమలపై సర్వే
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: వస్త్ర పరిశ్రమలో పని చేసే కార్మికుల్లో సగం మంది కంటి సమస్యలతో సతమతమవతున్నారు. నగర పరిధిలోని 5 వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న మొత్తం 1,360 మంది కార్మికుల స్థితిగతులపై ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ (ఎల్వీపీఈఐ) ప్రతినిధుల బృందం అధ్యయనం చేసింది. ‘దూర– సమీప దృష్టిలోపం.. పనిపై ప్రభావం’ అనే అంశంపై సర్వే చేపట్టారు. ఇందులో 40 ఏళ్లు పైబడిన వారు 52.4 శాతం మంది దగ్గరి దృష్టిలోపంతో బాధపడుతున్నారని తేలింది. మరో 6.9 శాతం మందిలో దూర దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. దగ్గరి దృష్టి లోపానికి ప్రధానంగా ప్రెస్బియోపియా, దూరదృష్టి లోపానికి వక్రీభవన లోపాలు 90 శాతం కారణమని తేల్చారు. కుట్టు పరిశ్రమ కార్మి కుల్లో దృష్టిలోపం గణనీయంగా ప్రభావితం చేస్తోందని సర్వేలో తేలింది. కార్మికులకు పరీక్షలు చేయించి, కళ్లజోడు అందిస్తే పరిశ్రమ ఉత్పత్తుల ఫలితాలు మెరుగుపడతాయని అభిప్రాయడ్డారు.
తెలుగు వర్సిటీని ప్రైవేట్కు అప్పగించొద్దు
నాంపల్లి: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం వర్సిటీ ప్రాంగణంలో జ్యోతిష విద్యార్థులు ‘మా చదువుల తల్లిని దూరం చేయొద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రాంగణంలోని కొంత భాగాన్ని టీజీపీఎస్సీ, చేనేత–జౌళి పరిశ్రమ శాఖలకు కేటాయించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ప్రాంగణాన్ని ఖాళీ చేయించి ఇతరు లకు అప్పగిస్తే తెలుగు విశ్వవిద్యాలయం తన ఉనికిని, ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


