చేవెళ్ల: బయోమాస్ పెల్లెట్స్ వినియోగంతో పర్యావరణానికి మేలుతోపాటు ఎల్పీజీ కోసం ఖర్చు చేసే లక్షకోట్ల సంపద దేశానికి మిగులుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో జేకేఎంఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రకాల బయోమాస్ పెల్లెట్ గ్యాసిఫైర్ స్టవ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పెల్లెట్స్ జొన్నసొప్ప, వరిపొట్టు, మక్కబుట్టలు, ఇతర వ్యవసాయ ఆధారిత మిగిలిపోయన వ్యర్థాల నుంచి తయారు చేయబడతాయన్నారు. చిరువ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులకు ఈ స్టవ్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇళ్లలో సైతం వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. కావాల్సిన వారికి జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్టవ్లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, శంకర్పల్లి అధ్యక్షుడు దయాకర్రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, నాయకులు మాణిక్యరెడ్డి, సత్యనారాయణ, శర్వలింగం, ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రాంరెడ్డి, నందు, శ్రీకాంత్రెడ్డి, గణేశ్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


