షాద్నగర్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి అన్నారు. షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామంలో గురువారం ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రగతి పోషణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి సీతా దయాకర్రెడ్డితోపాటు జిల్లా మహిళాభివృద్ధి అధికారి శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని 35 మంది గర్భిణులకు సీమంతాలు, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతా దయాకర్రెడ్డి మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వినియోగంతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యులు ప్రేమలత అగర్వాల్, బండి అపర్ణ, వచన్కుమార్, సీడీపీఓ ఉదయ, సర్పంచ్ రాజాగోపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, వీరభద్రప్ప, జంగయ్య, ఏపీఓ అరుణ, ప్రగతి వెల్ఫేర్సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అలోక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.


