● ప్రధాని మోదీపై విమర్శలు సిగ్గుచేటు
● బీజేపీ జిల్లా నేత నర్సింహగౌడ్
కొత్తూరు: రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా, అభివృద్ధిపై మాత్రమే చర్చలు, విమర్శలు జరగాలని బీజేపీ జిల్లా కోశాధికారి అమడపురం నర్సింహ గౌడ్ అన్నారు. దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు కనీస ఆలోచన ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఖర్గే ఇవేవీ పట్టించుకోకుండా మోదీని ఉగ్రవాది అనడం దారుణమన్నారు. ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నేతను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కేవలం తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రణధీర్గౌడ్, నాగరాజుచారి, మహేందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రాఘవులు, హరికృష్ణ, శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


