రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

కందుకూరు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈసంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రాచులూరుకు చెందిన గుంటి ప్రశాంత్‌(25) వృత్తిరీత్యా మత్స్యకారుడు. బుధవారం ఉదయం చేపల వేటకు బైక్‌పై ధన్నారం వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో బైరాగిగూడ గేట్‌ సమీపంలో ట్రాలీతో పాటు కాంక్రీట్‌ మిషన్‌, దానికి అనుసంధానంగా ఉన్న ఆయిల్‌ ఇంజన్‌తో ఉన్న ట్రాక్టర్‌ రాచులూరు గేట్‌ వైపు మరలుతోంది. దీనికి ఎలాంటి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వెనక ఉన్న ఆయిల్‌ ఇంజన్‌ను అంచనా వేయలేక బైక్‌తో ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దారి దోపిడీ ముఠా అరెస్టు

బంజారాహిల్స్‌: ఆవారాగా తిరుగుతూ జల్సాలు, గంజాయి కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఇటీవల జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–5లో మెట్రోస్టేషన్‌ వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్‌ శుభాంకర్‌ కుమార్‌ను రహమత్‌నగర్‌, బోరబండ ప్రాంతాలకు చెందిన బర్ల పవన్‌కళ్యాణ్‌ అలియాస్‌ డీజే పవన్‌, సాయిరాజ్‌ కుమార్‌ అలియాస్‌ చిట్టి, రేసు ప్రణీత్‌రెడ్డి, జశ్వంత్‌, అఖిల్‌, చందు, గోవు ఈశ్వర్‌ అటకాయించారు. దాడి చేసి బలవంతంగా మొబైల్‌ ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి పవన్‌కళ్యాణ్‌, రేసు ప్రవీణ్‌రెడ్డి, గోవు ఈశ్వర్‌గౌడ్‌లను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement