కొరడా
వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన వైద్యారోగ్య శాఖ
అనైతిక
ఆస్పత్రులపై
చర్యలు తప్పవు
వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొందకుండా ఆస్పత్రులు, క్లినిక్లు ఏర్పాటు చేసిన నకిలీ వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. పేదలు, నిరక్షరాస్యులు ఎక్కువగా నివసించే సరూర్నగర్, మీర్పేట్, నందనవనం, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, యాచారం, తలకొండపల్లి, మాడ్గుల, కేశంపేట్, కొందుర్గులో ఇవి ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా క్లినిక్లు ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా పేషంట్లను చేర్చుకుని, చికిత్సలు చేస్తున్న అనైతిక వైద్యులు, ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, ఆస్పత్రి రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసిన నార్సింగిలోని ఆరోన్ ఆస్పత్రిని అధికారులు ఇటీవల సీజ్ చేశారు. తాజాగా ఎలాంటి అనుభవం, అర్హతలేని శంకర్దాదా ఆర్ఎంపీలపైనే కాకుండా యునానీ, ఆయుర్వేద కోర్సులు పూర్తి చేసి అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతున్న వారిపైనా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే షాద్నగర్, హఫీజ్పేట, సరూర్నగర్లో పలు ఆస్పత్రులు, క్లినిక్లను సీజ్ చేశారు.
శంకర్దాదా ఆర్ఎంపీలపై చర్యలు
హైదరాబాద్ జిల్లాలో 286 ప్రభుత్వ, 2,298 ప్రైవేటు ఆస్పత్రులు, రంగారెడ్డి జిల్లాలో 355 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో కొండాపూర్లోని జిల్లా ఆస్పత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి సహా తొమ్మిది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 231 సబ్ సెంటర్లు, 57 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 2,500పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మెజార్టీ క్లినిక్స్ వనస్థలిపురం, హస్తినాపురం, సరూర్నగర్, బాలాపూర్, మీర్పేట్, హఫీజ్పేట్, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా వీటిని నడుపుతుండటంతో తరచూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మదీనాగూడలో రామకిరణ్ నడుపుతున్న కిరణ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, న్యూ హఫీజ్పేట గణేశ్ మండపం వద్ద అబ్దుల్ వాహిద్ నిర్వహిస్తున్న రెహమానియా క్లినిక్, ప్రేమ్నగర్లో ఎ.రమేష్ నడుపుతున్న శ్రీసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మార్తండనగర్లోని ఎం.కవిత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కొండాపూర్ గణేశ్ టెంపుల్ రోడ్డులోని పి.అర్వింద్ నడుపుతున్న శ్రీవేంకటేశ్వర క్లినిక్లను సీజ్ చేశారు.
ఆ కేసులో పట్టుబడిన పది..
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై అనుమానం రావడంతో 2023 సెప్టెంబర్లో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఎనిమిది జిల్లాల్లోని 28 ఆస్పత్రులు నకిలీ బిల్లులు సృష్టించి, నిధులను కొల్లగొట్టినట్లు తేలడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మోసాలు రుజువు కావడంతో చర్యలకు ఆదేశించింది. వీటిలో హైదరాబాద్ జిల్లాలో నాలుగు, రంగారెడ్డి జిల్లాలోని ఆరు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో మాదన్నపేటలోని జనని ఆస్పత్రి సహా బీఎన్ఎరెడ్డినగర్లోని శ్రీరక్ష ఆస్పత్రి, ఎల్బీనగర్లోని ఎంఎంస్ ఆస్ప త్రి, ఐఎస్సదన్లోని అరుణశ్రీ ఆస్పత్రి, సైదాబాద్లోని శ్రీకృష్ణ ఆస్పత్రి, రామంతాపూర్లోని ఏడీఆర్ఎం ఆస్పత్రి, కొత్తపేటలోని ఎంఎంవీ ఇందిరా ఆస్పత్రి, బైరమల్గూడలోని శ్రీసాయితిరుమల ఆస్పత్రి, హస్తినాపురంలోని డెల్టా ఆస్పత్రి, మీర్పేటలోని హిరణ్య ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో పలు ఆస్పత్రులను సీజ్ చేశారు.
అనుమతులు లేకుండా కొన్ని.. ఫేక్ సర్టిఫికెట్లతో మరికొన్ని..
నకిలీ మెడికల్ బిల్లులతో సీఎంఆర్ఎఫ్కు టోకరా
జిల్లాలో ఇప్పటికే పలు క్లినిక్లు సీజ్


