ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవునితండాలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై దంపతులకు నూతనవస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళనకు గురి కావద్దన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, సన్న బియ్యం తదితర పథకాలను అందజేస్తున్నామన్నారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గుంతలమయం
ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం చేయడానికి వాహనదారులు జంకుతున్నారు. మండల కేంద్ర శివారులోని చిట్టివాగుపై వంతెన సమీపంలో దారిపై అడుగుకో గుంత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డిపేట– వీర్నపల్లి మండలాలను కలుపుకొని 30 గ్రామాలకు వెళ్లడానికి వాహనదారులకు ఇదే ప్రధాన రహదారి. కాగా, రోడ్డుకు మరమ్మతు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డుకు మరమ్మతు చేసి ఇబ్బందులు తొలగించాలని వాహనదారుల కోరుతున్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)


