లోతట్టు.. ముప్పు
● ఏటా వరదలో మునుగుడే.. ● భయాందోళనలో వేములవాడ శివారుకాలనీలు ● మొదలైన వర్షాకాలం ● ముందస్తు చర్యలు శూన్యం
వేములవాడరూరల్: దక్షిణకాశీ.. ఆధ్యాత్మిక పట్టణంలోనూ వరదముప్పు తప్పడం లేదు. చిన్నపాటి వర్షం పడినా పట్టణ శివారుప్రాంతం ముంపునకు గురవుతోంది. పదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఏటా వరద తిప్పలు తప్పడం లేదు. వేములవాడ మున్సిపాలిటీలోని 13వ వార్డుతోపాటు తిప్పాపూర్ సవరాల కాలనీ, లక్ష్మీపురం ప్రాంతంలో పెద్దమ్మలొల్లు నివసించే ఏరియా, సిందుమాదిగలకాలనీలను వరద ముంచెత్తుతోంది. అయినా అధికారులు ముందస్తు వరద నివారణ చర్యలు తీసుకోవడం లేదు.
చిరువ్యాపారుల అడ్డా
కొన్ని కుటుంబాలు బుడిగెజంగాలకాలనీలో ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నాయి. కుడుకలు, పాత ఇనుప సామాన్ వ్యాపా రం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ 70 వరకు కుటుంబాలు ఉన్నాయి. పట్టణంలో ఉన్నా ఈ కాలనీని వర్షాకాలం కష్టాలు వీడడం లేదు. ఆ సమయంలో తాత్కాలిక ఉపశమనం కల్పిస్తున్న అధికారులు, పాలకులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
కట్టుకాల్వ కబ్జా
బుడిగెజంగాల కాలనీని ఆనుకుని వేములవాడరూరల్ మండలం మల్లారం ఫీడర్ చానల్ నుంచి గుడిచెరువులోకి నీరు చేరుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుడి చెరువులోకి నీరు తెచ్చేందుకు రూ.4కోట్లతో మిడ్మానేరు నుంచి ప్రత్యేక పైప్లైన్ వేశారు. లక్షల్లో బిల్లు వస్తుండడంతో మూలకుపడింది. మల్లారం ఆనకట్ట నుంచి దాదా పు 8 కిలోమీటర్ల మేర గుడి చెరువులోకి వచ్చే కట్టుకాలువ కబ్జాకు గురైంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడంతో కాలువ పూడుకుపోయింది. వర్షాకాలంలో మల్లారం నుంచి వచ్చే వర్షపు నీరు ఈ కాలువ ద్వారా ప్రవహించి బుడిగె జంగాలకాలనీలోకి వస్తోంది.


