● 28, 30 తేదీల్లో పల్స్ పోలియో ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలని, వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో గొట్టె జయశ్రీలతో కలిసి డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 28, 30 తేదీల్లో నిర్వహించే పల్స్పోలియో పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదేండ్లలోపు పిల్లలు 41,147 మంది ఉన్నారని తెలిపారు. 393 వాక్సినేషన్ కేంద్రాలు, 15 మొబైల్ బృందాలు, 38 సూపర్వైజర్లను నియమించినట్లు వివరించారు. జూలై 20లోపు ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు ఉన్న వారికి నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇండ్లల్లో పాతటైర్లు, కూలర్లు, ఇతరపాత్రలు, ఇంట్లో, ఇంటి ఆవరణలో నీరు నిలువ ఉండకుండా చూడాలని సూచించారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, లోకేష్ పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారి సమావేశానికి సన్నద్ధం కావాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో జిల్లాకు నియమితులైన ప్రత్యేకాధికారి శైలజా రామయ్యర్ నిర్వహించే సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. హౌసింగ్ పీడీ, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, సీపీవో పీబీ శ్రీనివాసాచారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎస్సీ, బీసీ అభివృద్ధి అధికారులు రవీందర్రెడ్డి, సౌజన్య, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, లోకేశ్ పాల్గొన్నారు.


