పక్కదారి పట్టించే వారిపై చర్యలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్
120 జతల కోడెలు పంపిణీ
వేములవాడఅర్బన్: రాజన్న గోశాల నుంచి అర్హులైన రైతులకు కోడెలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని శ్రీరాజరాజేశ్వరస్వామి గోశాలలో రైతులకు బుధవారం 120 జతల కోడెలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా హాజరయ్యారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాజన్నకు కోడెలను కట్టే సంస్కృతి వేములవాడలో ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు ఉచితంగా రాజన్న కోడెలను పంపిణీ చేస్తున్నామన్నారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మర్రిపల్లిలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల స్థలాన్ని గోశాలకు ప్రభుత్వం కేటాయించిందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు పశువైద్య, ఆలయ, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. కోడెలను వ్యవసాయ పనులకే వినియోగించాలని సూచించారు. కోడెలను తరచూ అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఆలయ ఈవో రమాదేవి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, తహసీల్దార్ జయంత్కుమార్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.


