టికెట్ల ధరలు ఇలా..
బద్దిపోచమ్మ గుడిలో బలవంతపు వసూళ్లు
టికెట్ ధర తక్కువ.. వసూల్ ఎక్కువ
కొబ్బరికాయ కొడితే రూ.10
బోనం పెడితే రూ.20
మేకపోతు జడ్తీకి రూ.100
వేములవాడ: ముందు డబ్బులిస్తేనే మొక్కును ముందుకు తీసుకెళ్తున్నారు బద్దిపోచమ్మ గుడిలో విధులు నిర్వహించే సిబ్బంది. రాజన్నను దర్శించుకున్న భక్తుల్లో 60శాతం మంది భక్తులు బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకుంటారు. నెత్తిన బోనంతో అవస్థలు పడుతూ ఆలయంలోకి చేరుకుంటున్న క్రమంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న సిబ్బంది కొబ్బరికాయ కొట్టాలంటే రూ.10 చెల్లిస్తే కాని ముందుకు పంపడం లేదు. అలాగే ఆలయంలోకి వెళ్లి అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకుంటున్న క్రమంలో రూ.20 టికెట్ తీసుకున్నా అదనంగా చెల్లిస్తేనే తమ బోనం ముందుకు సాగుతుంది. లేకుంటే చికాకుగా తోసెస్తున్నారంటూ మహిళా భక్తులు వాపోతున్నారు. మంగళవారం ‘సాక్షి’ బద్దిపోచమ్మ గుడిని విజిట్ చేయడంతో ఈ తతంగం బయటపడింది.
రాజన్న ఆదాయానికి గండి
వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో సిబ్బంది యథేచ్ఛగా వసూళ్లు చేస్తున్నారు. భక్తుల వద్ద టికెట్ల ధరలకంటే ఎక్కువ వసూలు చేస్తూ రాజన్న ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. మేకపోతు జడ్తీ ఇవ్వాలంటే రూ.100, పట్నం మొక్కులకు రూ.100 చెల్లిస్తే రూ.1000 నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నారని భక్తులు మొత్తుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న భక్తులపై తిరగబడుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతీరోజు సాయంత్రం ఆలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు పంపకాలు చేసుకొని ఇళ్లకు వెళ్తున్నట్లు ఆరోణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో బద్దిపోచమ్మ ఆలయంలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందని భక్తులు మండిపడుతున్నారు. కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా నామమాత్రపు చర్యలు తప్ప దోపిడీని అరికట్టిన దాఖలాలు కనిపించడం లేదంటున్నారు.
పట్నం రూ.100, బోనం రూ.20
కల్లుశాక రూ. 05, బెల్లంశాక రూ. 05


