● కలెక్టర్ గరీమా అగ్రవాల్
వీర్నపల్లి: రైతులు సాగులో నూతన ఒరవడి సృష్టించాలని, పంట మార్పిడిలో భాగంగా సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సోమవారం వీర్నపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విద్యాసంస్థలు, హాస్టళ్లు, రేషన్షాపులో సన్న బియ్యం వినియోగిస్తున్నారని, దీనికనుగుణంగా రైతులు సన్న రకాలు పండించాలని సూచించారు. విత్తన మేళా ప్రారంభించి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద కలెక్టర్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్బాబు, మండల ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీవో బీరయ్య, సర్పంచ్ జ్యోత్స్న, ఉప సర్పంచ్ జక్కుల నరేష్ ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కేజీబీవీ తనిఖీ
వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజస్టర్లను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల వసతి, భోజన నాణ్యతపై పలు కీలక ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణరెడ్డి తదితరులున్నారు.
గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలోని గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, డీటీడబ్ల్యూవో సంగీత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అయేషా తలత్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష, ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాళ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


