● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి (వేములవాడ): రైతులు లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి మండలం మర్రిగడ్డ రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తనమేళాలో పాల్గొని మాట్లాడారు. వరిలో ఏడు రకాల సన్నాలను సాగు చేసుకొని ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ పొందాలని సూచించారు. మండలంలో ప్రభుత్వం 12వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసిందని, ఇప్పటి వరకు 500 క్వింటాళ్ల విత్తనాలు విక్రయించారన్నారు. జిల్లావ్యాప్తంగా 2.48 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తుండగా అందులో 1.92లక్షల ఎకరాల్లో వరినే సాగు చేస్తున్నారని తెలిపారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాం నుంచి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూపతి, ఆత్మ కమిటీ చైర్మన్ ముష్కు ముకుందరెడ్డి, సర్పంచ్ మనీషా శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయాధికారి దుర్గారాజు, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


