భీమన్న ఆలయంలో వసతులు
చలువపందిళ్లు.. నీటి వసతి
శ్రీసీతారామ కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
వేములవాడ: రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో వేసవిలో భక్తులు ఇబ్బంది పడొద్దని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చలువపందిళ్లు.. నీటి వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారం సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలు ప్రారంభించారు. స్కానర్ను స్కాన్ చేయడం ద్వారా లేదా 87369 36969కు ఏజీ అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయి. భక్తుల దాహార్తిని తీర్చేందుకు రాజన్న జలప్రసాదం పేరుతో రెండు తాగునీటి కేంద్రాలను ప్రారంభించారు. క్యూలైన్ల వద్ద నల్లాలు ఏర్పాటు చేశారు.
శ్రీసీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు
హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 27న నిర్వహించే శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ఈమేరకు పోస్టర్, ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో రాజరాజేశ్వరస్వామికి ఏకాంత సేవలు నిర్వహిస్తూనే సీతారాముల కల్యాణోత్సవాన్ని శివార్చన వేదికపై జరుపనున్నారు.
లడ్డూ ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు
రాజన్న ప్రసాదం లడ్డూ తయారీ గోదాంలో ఆలయ ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లడ్డూ తయారీ, బరువు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. వంటశాలలోని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏఈవో శ్రవణ్, ఇతర అధికారులు ఉన్నారు.


