● సిరిసిల్ల బస్టాండులో వసతుల లేమి ● ప్రయాణికులకు తప్పని తాగునీటి తిప్పలు ● ప్లాట్ఫాంలపై నిల్చోలేని స్థితి ● ఇష్టానుసారంగా ప్రైవేటు వాహనాల పార్కింగ్
సిరిసిల్ల పాత బస్టాండ్లో నిరుపయోగంగా ఉన్న తాగునీటి మిషన్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో ఎటూ చూసిన సమస్యలే. తాగేందుకు నీరు దొరకదు. నిల్చునేందుకు నీడ లేదు. దుకాణదారులు దౌర్జన్యంగా ప్లాట్ఫామ్స్ను ఆక్రమిస్తుండడంతో అక్కడ సైతం ప్రయాణికులు నిల్చునే పరిస్థితులు లేవు. ఇక వాహనదారులు బస్టాండ్ ప్రాంగణంలో దుకాణాల ఎదుటే ఇష్టారీతిగా నిలుపుతున్నారు. దీంతో ప్లాట్ఫామ్స్పై నిల్చోలేక.. కిందికి వద్దామంటే వాహనాలు నిలిపి ఉండడంతో బస్సులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో సమస్యలపై ఫోకస్.
● ఇరవై వేలకు పైగా రాకపోకలు
సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడి పుష్కరకాలమైంది. కలెక్టర్, ఎస్పీలతోపాటు అన్నిశాఖల జిల్లా అధికారులు స్థానికంగా ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య నిత్యం ఇరవైవేలకు మించుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండులో వసతులు లేవు.
● చెట్ల నీడే దిక్కు
పాతబస్టాండ్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ కావడంతో నీడ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ప్రయాణికులు కూర్చునేందుక షెల్టర్ సరిపోవడం లేదు. పదుల సంఖ్యలోనే కుర్చీ లు ఉన్నాయి. హైదరాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్లాట్ఫామ్స్ స్థానంలో షెడ్లు నిర్మిస్తామన్న అధికారుల హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆయా ప్లాట్ఫామ్స్ వద్ద ఉండే వ్యాపారులు తమ సామగ్రిని దుకాణాల బయట పెడుతుండడంతో ప్రయాణికులకు నిల్చునే అవకాశం కూడా ఉండడం లేదు. అంతేకాకుండా ఇక్కడ వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ ప్లాట్ఫామ్స్ వద్ద మున్సిపల్ అధికారులు గ్రీన్నెట్స్ వేయించే వారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ తాగునీటి కేంద్రం మూతబడింది.
మండుటెండలో నిల్చున్న ఈ ప్రాంతం సిరిసిల్లలోని పాతబస్టాండ్. నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. కొత్తబస్టాండు దూరంగా
ఉండడంతో చాలా మంది పాతబస్డాండు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.
బస్టాండు ప్రాంగణం చిన్నదిగా ఉండటంతో కొద్దిమందికి మాత్రమే నీడ లభిస్తుంది.
అక్కరకురాని కొత్తబస్టాండ్
పట్టణ శివారులోని ఆర్టీసీ డిపో వద్ద నిర్మించిన కొత్తబస్టాండు ప్రజలకు అక్కరకు రాకుండా పోతుంది. శివారులో ఉండడంతో అంతదూరం వెళ్లలేక అందరూ పాతబస్టాండ్కు వస్తండడంతో ఇక్కడ రద్దీ పెరుగుతుంది.


