● ఐదు నిమిషాల వరకు అనుమతి ● వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్కు అవకాశం ● జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై టెన్షన్ పడొద్దని.. ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించామని.. తాగునీరు.. నిరంతర విద్యుత్ సరఫరా.. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తదితర వివరాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
34 కేంద్రాలు.. 7,317 మంది విద్యార్థులు
జిల్లాలో 7,317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 530 మంది ఇన్విజిలేటర్లు, పర్యవేక్షణ కోసం 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 34 సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశాం. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.
ఐదు నిమిషాల వరకు అనుమతి
పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను సెంటర్లోకి అనుమతిస్తారు. అంతకుమించి ఆలస్యమైతే లోనికి అనుమతించరు. ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజుతో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తాయని ఉద్దేశంతో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. విద్యార్థులు బీఎస్ఈ తెలంగాణ అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
నిఘా నేత్రాల మధ్య ప్రశ్నాపత్రాలు
పరీక్షా ప్రశ్నాపత్రాలు ముందుగా బహిర్గతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో నిర్ణీత సమయానికి ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేస్తాం. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. ఎలాంటి బెరుకు లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి.


