● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసపత్రాలు
సిరిసిల్ల క్రైం: పోలీసులు విధి నిర్వహణలో భాగంగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతోపాటు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం సైతం కీలకపాత్ర పోషిస్తుందని కొనియాడారు. సాయుధ దళాల వార్షిక పునశ్చరణ(మొబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం పరేడ్ మైదానంలో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం బాధ్యతాయుతమైందని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకు మొబిలైజేషన్ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సర్దాపూర్లోని బెటాలియన్లోని ఫైరింగ్ రేంజ్లో ఇచ్చే శిక్షణను పర్యవేక్షించారు. ఫైరింగ్లో బి.శ్రీనివాస్(ప్రథమ), జి.వెంకటేశ్(ద్వితీయ), ఎ.ప్రియాంక(తృతీయ), రాత పరీక్షలో మనోజ్కుమార్(ప్రథమ), బి.శ్రీనివాస్(ద్వితీయ), డి.ప్రియాంక(తృతీయ) స్థానాల్లో నిలిచారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.


