● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల విజయాలను తెలుపుతూ వెల్ది రేఖ రూపొందించిన నారీశక్తి చీరను ఆవిష్కరించారు. అపెరల్ పార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టుమెషిన్లను అందజేశారు. డీఆర్డీవో గీత, చేనేత జౌళిశాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆఫీస్లను పరిశుభ్రంగా ఉంచాలి
ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్లోని ప్రతీ జిల్లా కార్యాలయం, సిరిసిల్ల, వేములవాడ, ఆయా ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ఆఫీస్లు, మున్సిపల్, తహసీల్దార్ ఆఫీస్లు, ఎంపీడీవో కార్యాలయాల్లో స్వచ్ఛత.. పరిశుభ్రత పనులు పక్కాగా చేయాలన్నారు. నిరుపయోగ వస్తువులు, చెత్తాచెదారం ఉండకూడదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు సీహెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయి తదితరులు పాల్గొన్నారు.


