ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ గౌతమినగర్కు చెందిన కొప్పుల రాజయ్య ఆస్ట్రేలియాలో ఈనెల 3న గుండెపోటుతో మృతి చెందారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తన కుమారుడు కొప్పుల ప్రసాద్ దగ్గరికి మూడు నెలల క్రితం వెళ్లారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సోమవారం గౌతమినగర్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. కొప్పుల రాజయ్య.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దనాన్న కుమారుడు అవుతారు. దీంతో ఆయన అంత్యక్రియల్లో మాజీమంత్రి పాల్గొని పాడె మోశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
సిరిసిల్ల క్రైం: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రెడీమిక్సర్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు. మృతుడి వయస్సు సుమారు 40–45 ఏళ్ల మధ్య ఉంటుందని, సుమారు 5 అడుగులు 4 అంగుళాల ఎత్తు ఉంటాడని తెలిపారు. ఆకుపచ్చ రంగు ప్యాంటు ధరించి ఉండగా, మెడలో ఎరుపు రంగు దండ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. వివరాల కోసం సీఐ ఎన్.శ్రీనివాస్ 87126 56366, సబ్ ఇన్స్పెక్టర్ ఎ.మురళీధర్గౌడ్ 99898 07854లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
● గూడ్స్ వాహనాల్లో తరలింపు
కరీంనగర్రూరల్: ఇసుక అక్రమార్కులు రోజుకో కొత్త తరహా మార్గాలను అనుసరిస్తున్నారు. గూడ్స్ వాహనాల్లో కరీంనగర్కు ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో నయా దందా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానేరువాగు నుంచి సన్నపు ఇసుకను సంచుల్లో నింపుకుని అక్రమార్కులు గూడ్స్ వాహనాల్లో కరీంనగర్కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన గూడ్స్ వాహనాన్ని పట్టుకున్నారు. వేములవాడకు చెందిన డ్రైవర్ ఎర్రెల్లి సురేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా యజమాని చొప్పరి శివప్రసాద్ ఆదేశాల మేరకు ఇసుక రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. సోమవారం గొల్లపల్లి మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న బేతి సునీల్రెడ్డి, బొమ్మకల్కు చెందిన దొమ్మాటి మల్లేశం, బండారి అరవింద్ ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


