వేములవాడ: వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువకుడు మోహన్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడు హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం పట్టణ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. జిల్లాలోని అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్కు వేములవాడకు చెందిన వివాహిత బైరి శారద ఉరఫ్ కళ్యాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మోహన్ తరచూ డబ్బులు అడగడమే కాకుండా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో శారద తన భర్త శేఖర్కు ఈ విషయం తెలిపింది. అనంతరం భార్యభర్తలు కలిసి మోహన్ను హత్య చేయాలని ప్రణాళిక వేశారు. వీరిద్దరూ గుండం రవి ఉరఫ్ రవీందర్ సహకారం తీసుకున్నారు. ఈనెల 4న మోహన్ను శారదతో వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్కు పిలిపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న శేఖర్, రవి ఇద్దరు కలిసి నైలాన్తాడుతో మోహన్కు ఉరివేసి హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో తిప్పాపూర్ ప్రధాన బస్స్టాండ్ వద్ద బైరి శారద, బైరి శేఖర్, గుండం రవిలను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక బైక్, నైలాన్తాడు, చాకు స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు రామ్మోహన్, ప్రేమానందం, కానిస్టేబుళ్లు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్ను డీఎస్పీ అభినందించారు.
భర్తతో కలిసి ప్రియుడి హత్య
వీడిన వేములవాడ లాడ్జీలోని యువకుడి మృతి కేసు
ముగ్గురి రిమాండ్


