ఒకే భవనంలో 12 రకాల కోర్టులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీశ్కుమార్ సింగ్ సిరిసిల్లలో నూతన కోర్టు కాంప్లెక్సుకు భూమి పూజ
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులు, సకల వసతులతో నూతన కోర్టు భవనాల సముదాయం నిర్మిస్తున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీశ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్సు నిర్మాణానికి శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేసి మాట్లాడారు. జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
పారదర్శకంగా న్యాయసేవలు
నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ కక్షిదారులకు పారదర్శకంగా న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ పేర్కొన్నారు. ప్రతీ పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలన్నారు.
టెక్స్టైల్తో ఉపాధి
జిల్లాలో టెక్స్టైల్, పవర్లూమ్ పరిశ్రమతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. వేలాది మంది నేత కార్మికులు రేయింబవళ్లు శ్రమించి దేశవ్యాప్తంగా పేరు పొందిన వస్త్రాలను తయారు చేస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం జిల్లాలోనే ఉందన్నారు.
సన్మానాలు..సందర్శన..వితరణ
వేదికపై హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజలను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్, అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీలను సన్మానించారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్స్, బ్యాటరీ వీల్చైర్స్, ఎంపవర్కార్ట్స్ను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, 1వ అదనపు జిల్లా జడ్జి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి, అజయ్ కుమార్ జాదవ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, సిరిసిల్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు కావేటి సృజన, గడ్డం మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేశ్కుమార్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, గవర్నమెంట్ ప్లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.


