● రెండు జిల్లాల సరిహద్దుల్లో సంచారం ● ఆరా తీస్తున్న అటవీశాఖ అధికారులు
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న పుకార్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న ఆనవాళ్లను నిజామాబాద్ అటవీశాఖ అధికారులు గురువారం గుర్తించారు. కాగా అదే ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా సంచరిస్తుండడం చర్చకు దారితీసింది. అధికారులు మాత్రం ఒక చోట రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదంటున్నారు. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో నుంచి రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి–మల్యాల రేంజ్ పరిధిలోకి ప్రవేశిస్తుందన్న ప్రచారంతో ఈ ప్రాంత అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా పెద్దపులి ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ఫారెస్ట్లో శ్రమిస్తున్నారు. గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్తోపాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడే రెండు, మూడు రోజులుగా ఉండడంతోపాటు అటవీ జంతువును హతమార్చి తిన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి–మల్యాల రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రుద్రంగి మండలం మానాల అటవీ ప్రాంతంలోకి శనివారం వెళ్లి పెద్దపులి ఆనవాళ్ల కోసం పరిశీలించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.


