కొత్త, పాత సర్పంచుల మధ్య కార్యదర్శులు
● జిల్లాకు రూ.19.73 కోట్ల మేర ఎఫ్ఎఫ్సీ నిధులు ● బిల్లులు చెల్లించాలంటున్న పాత సర్పంచులు ● తాము పనులు చేస్తామంటున్న కొత్త పాలకులు ● ప్రత్యేక పాలనతో అప్పులపాలైన సెక్రటరీలు
బోయినపల్లి(చొప్పదండి): ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు కార్యదర్శులు, కొత్త సర్పంచుల మధ్య లొల్లి పెట్టిస్తున్నాయి. మాజీ సర్పంచులు తాము పనులు చేసి అప్పులపాలయ్యామని బిల్లులు చెల్లించాలని కోరుతుండగా.. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచామని తామే పనులు చేస్తామంటూ కొత్త పాలకులు పేర్కొంటున్నారు.
రూ.19.73 కోట్ల ఎఫ్ఎఫ్సీ నిధులు
15వ ఆర్థిక సంఘం నుంచి 2023–24, 2024–25, 2025–26 సంవత్సరాలకు రూ.19,73,02,492 మంజూరయ్యాయి. ఇందులో బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు రూ.1,83,93,126 మంజూరయ్యాయి. వచ్చిన నిధుల నుంచి శానిటేషన్, తాగునీటి పనులకు 60 శాతం నిధులు కేటాయించాలని, మిగతా 40 శాతం వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలాంటి అభివృద్ది పనులకు వినియోగించాలనే అంశంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు ప్రణాళికలు వేస్తున్నారు.
సయోధ్య లేక ఇబ్బంది
నూతనంగా ఎన్నికై న సర్పంచులతో జిల్లాలోని పలు గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు సయోధ్య కరువైందని తెలుస్తోంది. ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లీడర్లా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ గ్రామపంచాయతీ కార్యాలయంలో ముగ్గురు మల్టీపర్పస్ సిబ్బంది ఉండగా, కార్యదర్శి ఇద్దరితోనే పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. మరో సిబ్బందితో కార్యదర్శి సొంత పనులకు వినియోగిస్తున్నారని సర్పంచ్ వాపోతున్నారు. అందరిని సమానంగా చూడాలంటున్నారు. ఓ గ్రామంలో కార్యదర్శి సర్పంచ్కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పలు గ్రామాల కొత్త సర్పంచులు తమ గ్రామాల పంచాయతీ కార్యదర్శుల నుంచి ఇబ్బంది ఉందని వారిని జంబ్లింగ్లా మార్చాలని ఇటీవల రత్నంపేటకు వచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
బోయినపల్లి మండలంలోని గ్రామాలకు రూ.1.83 కోట్ల ఎఫ్ఎఫ్సీ నిధులు మంజూరయ్యాయి. వీటిపై గతంలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాని మాజీ సర్పంచులు గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా సుమారు రూ.60 లక్షలకు పైగా పాత సర్పంచులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని సమాచారం. కొన్నాళ్లుగా బిల్లుల మంజూరు కోసం వివిధ రూపాల్లో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలిపారు. కాగా ఏడాదికి పైగా ప్రత్యేకాధికారుల పాలనలో వివిధ పనులు చేపట్టి పలువురు కార్యదర్శులు అప్పుల పాలైనట్లు సమాచారం. కొత్త సర్పంచులు ఎన్నికై న తర్వాత నిధులు రావడంతో తామే అభివృద్ధి పనులు చేస్తామంటున్నారు. ఇప్పుడు వచ్చిన నిధులతో పాతసర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే తామెలా అభివృద్ధి పనులు చేయాలని కొత్త సర్పంచులు వాపోతున్నారు.


