వెబ్కాస్టింగ్ సెంటర్ పరిశీలన
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ సెంటర్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలోని సినారె కళామందిరాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా వెబ్కాస్టింగ్ సెంటర్లో పరిశీలించారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, శ్రావణ్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11(ఆర్డీ13 ఎల్ఎం6) కాలువ పనులు పూర్తిచేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం నాలుగో రోజుకు చేరాయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం సర్సింహులపల్లి సహా 12 గ్రామాల రైతులు దీక్షలో పాల్గొన్నారు. 13 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతులు కరికె నవీన్ కుమార్, సేరు ఎల్లం, శ్రీనివాస్, అశోక్, పర్శరాములు, వెంకట్రెడ్డి, అనిల్, యాద ఎల్లయ్య, కమటం రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘మా కాలేజీ – మా తల్లి చెట్టు’ అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల ప్రాంగణంలో ఏళ్లనాటి వృక్షాన్ని కాలేజీ తల్లి చెట్టుగా గుర్తించి మొక్కల రక్షణకు ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధర్మపురి, అధ్యాపకులు సుచరణ్, శ్రావణ్కుమార్, ఆది విష్ణు, భిక్షమయ్య, మనోహర్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, మహేశ్, జగన్నాథం, భార్గవి, దీపిక, రమ్య, రవీందర్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియాను కౌంటింగ్ కేంద్రంలోకి పంపించాలని అధికారులను, పోలీసులను కోరారు. పరిస్థితి చేజారేలా కన్పించడంతో వెంటనే అధికారులు స్పందించి మీడియాను అనుమతిస్తామని చెప్పడంతో రాజకీయ నాయకులు వెనుదిరిగారు. వేములవాడలో మండల పరిషత్ ఎదుట రోడ్డుపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో రాధాభాయి వారి వద్దకు చేరుకుని ఇద్దరి చొప్పున కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.


