ఆధ్యాత్మిక కేంద్రంలో హస్తం హవా
వేములవాడ/వేములవాడరూరల్: ఆధ్యాత్మిక కేంద్రం వేములవాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 28 వార్డులకు 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 8 సీట్లకే పరిమితం కాగా, బీఆర్ఎస్ ఐదు స్థానాల్లో, ఇద్దరు స్వతంత్రులు విజ యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపులో ఉండగా, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు శుక్రవారం క్యాంపునకు తరలివెళ్లారు.
కాంగ్రెస్లోకి మరో ముగ్గురు
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులకు గాను 13 వార్డుల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు అభ్యర్థులు తోడయ్యారు. స్వతంత్రులుగా గెలిచిన కుమ్మరి శిరీష, ఆలె శ్రీనివాస్లతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నరాల శేఖర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 16 సీట్లకు పెరిగింది.
ఒక్కటి నుంచి 13కు కాంగ్రెస్
వేములవాడ మున్సిపాలిటీకి 2020లో జరిగిన ఎన్నికల్లో వేములవాడ 1వ వార్డు నుంచి సంగ హన్మవ్వ మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఒకే స్థానంతో ఐదేళ్లు పోరాడిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 13 స్థానాలకు ఎగబాకింది.
విలీన గ్రామాల్లో హస్తం
వేములవాడలో విలీనమైన శాత్రాజుపల్లి, అయ్యోరుపల్లి, కోనాయపల్లి, నాంపల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ గాలి వీచింది. విలీన గ్రామాల్లో 4 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు విజయం సాధించారు. వేములవాడ మున్సిపల్గా ఏర్పడ్డ తొలిసారి బీజేపీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. అప్పుడు నామాల ఉమ, రెండోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున రామతీర్థపు మాధవి చైర్పర్సన్లు అయ్యారు. మూడోసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు.


