చెరోటి
● సిరిసిల్లలో గులాబీ గుబాళింపు ● వేములవాడలో హస్తం కై వసం ● కార్మిక క్షేత్రంలో కారు హ్యాట్రిక్ విజయం ● ఆధ్యాత్మిక క్షేత్రంలో విలక్షణ తీర్పు
సిరిసిల్లటౌన్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరోటి కైవసం చేసుకున్నాయి. సిరిసిల్లలో వరుసగా మూడోసారి గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. వేములవాడ తొలిసారి హస్తం పార్టీకి దక్కింది. సిరిసిల్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్నంబర్లకే చతికిలపడ్డాయి. వేములవాడలో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ సాగింది. సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరాల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.
కార్మిక క్షేత్రంలో కారు హవా
సిరిసిల్ల మున్సిపల్లో 39 వార్డులకు.. 27 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీజేపీ, స్వతంత్రులు ఒక్క స్థానంలో విజయం సాధించారు. సీపీఎం, జనసేన, ఏఐఎఫ్బీ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. మూడోసారి బీఆర్ఎస్ ఖాతాలో సిరిసిల్ల మున్సిపాలిటీ చేరింది.
చైర్పర్సన్, వైస్చైర్మన్ స్థానాలపై గురి
సిరిసిల్లలో మెజార్టీ వార్డుల్లో విజయం సాఽధించిన బీఆర్ఎస్లో మున్సిపల్ చైర్పర్సన్ స్థానంపై పలువురు అభ్యర్థులు గురిపెట్టారు. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సతీ మణి జిందం కళ చైర్పర్సన్గా 2020లో గెలిచి ఐదేళ్లు పాలించారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి సామల పావని ఐదేళ్లు పరిపాలించారు. ప్రస్తుతం మళ్లీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. చైర్పర్సన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు నిర్ణయించనుండడంతో ఆశా వహకులు ఆయన నిర్ణయం కోసం ఆశగా చూస్తున్నారు. ఈక్రమంలో మరికొందరు విద్యావంతులైన బీసీ మహిళలు చైర్పర్సన్గా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైస్చైర్మన్ స్థానం కోసం సీనియర్ నాయకులు పోటీపడుతున్నారు.
ఈనెల 16న ప్రమాణ స్వీకారం, చైర్పర్సన్ ఎన్నిక
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఈక్రమంలోనే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. నేరుగా సోమవారం జరిగే ప్రమాణ స్వీకారానికి రానున్నారు.
ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు
స్థానిక సినారె కళామందిరంలో భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులు, వారి తరఫున కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలకు చేరుకున్నారు. మూడు అంచెల భద్రత మధ్య తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు తర్వాత బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూమ్ నుంచి తెచ్చి ఓట్లు లెక్కించారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలు అందించి సోమవారం జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఎన్నికల పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు.
చెరోటి


