
కలెక్టర్.. అన్నీ అదనపు బాధ్యతలు
వీరు సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు. వీరు పారిశుధ్యం, డంపుయార్డు, నల్లాల నిర్వహణ, చెత్తట్రాక్టర్ల నిర్వహణ పనులు చేస్తుంటారు. గతంలో పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ నెల వేతనాలు వచ్చేవి. అయితే గత రెండు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. వచ్చే రూ.14వేలు సైతం రెండు నెలలుగా రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్ ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితులు జిల్లాలోని చాలా శాఖల్లోనూ ఉంది. ఆయా శాఖల అధికారులు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. సామన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
● జిల్లా పాలనాధికారిగా 55 శాఖలపై ఆజమాయిషీ ● మరో ఏడు శాఖల అదనపు బాధ్యతలు ● పెండింగ్లో అనేక ఫైళ్లు ● సామన్యులు ఇబ్బంది
సిరిసిల్ల: కలెక్టర్.. జిల్లా బాస్. పాలనాధికారిగా ఎన్నో బాధ్యతలు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలోని 55 శాఖలపై ఆజమాయిషి. వీటికి అదనంగా మరో ఏడు శాఖల అదనపు బాధ్యతలు కలెక్టర్ వద్దనే ఉన్నాయి. దీంతో కొన్ని ఫైళ్లకు నెలలుగా మోక్షం కలగడం లేదు. ఫలితంగా ఆయా శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగులు, వేతన జీవులు ఇబ్బందులు పడుతున్నారు. 2024 జూన్ 16న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్కుమార్ ఝా.. పది నెలల కాలంలో అనేక వివా దాలు చుట్టుముట్టాయి. అదనపు ఏడు శాఖల బాధ్యతలతో ఆయా శాఖల ఫైళ్లు వేగంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
కలెక్టర్ వద్ద ఉన్న అదనపు శాఖలు ఇవీ..
● జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసిన పూజారి గౌతమి బదిలీ కావడంతో ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ఆ శాఖ బాధ్యతలు సైతం కలెక్టర్ నిర్వహిస్తున్నారు.
● జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పదవీకాలం 2024 జూలై మొదటివారంలో ముగిసింది. అప్పటి నుంచి జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు.
● జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఖీమ్యానాయక్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సైతం కలెక్టరే చూస్తున్నారు. సెలవులు ముగిసి.. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్గా ఖీమ్యానాయక్ విధుల్లో చేరినా ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించకుండా కలెక్టర్ పర్యవేక్షించడం గమనార్హం.
● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్ల పదవీకాలం 2025 జనవరితో ముగిసింది. ఆయా మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఉన్నారు.
● వేములవాడ ఆర్డీవో రమేశ్ ఇటీవల సెలవుపై వెళ్లగా.. ఆ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
● వేములవాడ ఏరియా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రెటరీగా కలెక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ... ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)కి చైర్మన్గా ముఖ్యమంత్రి, వైస్చైర్మన్గా కలెక్టర్ కొనసాగుతున్నా.. అదనంగా సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించిది.
ఫైళ్ల కదలికలో జాప్యం
జిల్లా స్థాయిలో ఒక్కో శాఖకు ఒక్కో అధికారి పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. ఏదైనా ఫైల్ కలెక్టర్ ఆమోదం కోసం వెళ్లాలంటే.. అన్ని రికార్డులను సరిగా చూసి జిల్లా స్థాయి అధికారి సంతకం చేసి ఈ–ఆఫీస్(ఆన్లైన్)లో ఉంచితే.. కలెక్టర్ ఆ ఫైల్కు ఆమోదం తెలుపుతారు. ఏదైనా అనుమానం ఉంటే ఆ ఫైల్ను ఫిజికల్గా తెప్పించుకుని పరిశీలిస్తారు. ఇలా ప్రభుత్వ పరిపాలన కొంత నిర్ధిష్ట గడువుతో సాగుతోంది. కానీ అనేక శాఖలకు అదనపు బాధ్యతలు జిల్లా కలెక్టర్ చూడడంతో ఆయా శాఖల ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ ఫైల్ తాలూకు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇన్చార్జీలతోనే పాలన !
జిల్లాలో అనేక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక ఇన్చార్జీ అధికారులతో కొనసాగుతున్నాయి. సిరిసిల్ల ఆర్డీవోగా సమ్మయ్య నియమితులు కాగా.. ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆయన విధుల్లో చేరకుండానే బదిలీ చేయించున్నట్లు సమాచారం. సిరిసిల్ల ఆర్డీవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అనేక కీలకమైన ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇన్చార్జీలతో పాలన సాగుతోంది.
నాకు ఇంకా పని తక్కువగానే ఉంది
జిల్లాలో నాకు ఇంకా పని తక్కువగానే ఉంది. నేను చేయాల్సింది ఇంకా ఎక్కువగా ఉంది. వీటీడీఏ సెక్రెటరీగా సోమవారం బాధ్యతలు స్వీకరించాను. సిరిసిల్ల మున్సిపాలిటీ బిల్స్ క్లియర్ చేశాను. కలెక్టర్గా నేను అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సిందే.
– సందీప్కుమార్ ఝా, కలెక్టర్

కలెక్టర్.. అన్నీ అదనపు బాధ్యతలు