నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌ను తప్పుపడతారా? | - | Sakshi
Sakshi News home page

నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌ను తప్పుపడతారా?

Apr 12 2025 2:52 AM | Updated on Apr 12 2025 2:52 AM

నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌ను తప్పుపడతారా?

నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌ను తప్పుపడతారా?

● తక్షణమే దుష్ప్రచారం నిలిపేయండి ● లేనిపక్షంలో చర్యలు తప్పవు ● జాతీయ ఎస్సీ కమిషన్‌ హెచ్చరిక

సిరిసిల్ల/కరీంనగర్‌టౌన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో జరిగిన ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్‌ స్పందించారు. నేరెళ్ల ఘటనపై కొందరు సోషల్‌ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్‌ను బద్‌నాం చేస్తున్నట్లు తెలుసుకున్న కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్‌ను దుష్ప్రచారం చేయడాన్ని నిలిపివేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరెళ్ల ఘటనలో ఎస్సీ కమిషన్‌ చేపట్టిన విచారణతోపాటు ప్రభుత్వానికి పంపిన మధ్యంతర నివేదికను విడుదల చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా నివేదిక రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. నేరేళ్ల గ్రామంలో విచారణ చేపట్టడంతోపాటు కరీంనగర్‌ జైలుకు వెళ్లి బాధితులను కలిసి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి కలెక్టర్‌, పోలీసు అధికారుల స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేసినట్లు స్పష్టం చేశారు. 2017 ఆగస్టు 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర నివేదికలోని ఐదు ప్రధాన అంశాలను సైతం బహిర్గతం చేశారు. ఈ ఘటనపై హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, అప్పటి ఎస్పీని బదిలీ చేయాలని, సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని, బాధితులకు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఒక్కో బాధితుడికి రూ.5లక్షల పరిహారం అందించాలని నివేదికలో స్పష్టం చేసినట్లు రామచందర్‌ వివరించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే.. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement