ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

బీటీఏ డిమాండ్‌

ఒంగోలు సిటీ: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని బీటీఏ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు. బీటీఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు పారాబత్తిన జాలరామయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ 55 ఏళ్ల వయస్సు దాటిన ఉపాధ్యాయులను కూడా ఇప్పుడు టెట్‌ రాయమనడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోందని, టెట్‌ సిలబస్‌ కూడా చాలా అసంబద్ధంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులో కాకుండా ఇతర సబ్జెక్టుల్లో సిలబస్‌ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఆందోళనకు గురైతే పాఠశాలలో విద్యా బోధన కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా దేవ సహాయం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం ఇంటీరియం రిలీఫ్‌ ప్రకటించాలని, 12వ పే కమిషన్‌ నియమించాలని డిమాండ్‌ చేశారు. సరెండర్‌ లీవ్‌ బకాయిలు నాలుగు సంవత్సరాల నుంచి చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు డీఏలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏల్చూరి మాధవరావు, పల్లె కృష్ణ్ణమూర్తి, పాలేటి సువర్ణబాబు, చెక్క కోటేశ్వరరావు, కొప్పోలు కిషోర్‌, చిటితోటి రామకృష్ణారావు, అల్లరి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement