వెలిగొండ ప్రాజెక్టుకు అంతా తానే చేశానని చంద్రబాబు బీరాలు 1996 నుంచి 2004 వరకు శంకుస్థాపన తప్ప చేసింది శూన్యం పైసా విదల్చకుండా మాటలతో కాలయాపన 2014–19లో ఏటీఎంలా వాడుకున్న బాబు ప్రాజెక్టును డిజైన్ చేసి, పూర్తి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డిలే రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్ 2024 ఆగస్టు 24కే నీరిచ్చేలా ప్రణాళిక రెండేళ్లు పనులు చేయకుండా జాప్యం చేసిన బాబు ఇంకా రూ.3500 కోట్ల పనులు పెండింగ్ అయినా హడావిడిగా నేడు నీళ్లు వదులుతూ డ్రామాలు
మూడు దశాబ్దాల కల..ప్రకాశం జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. శంకుస్థాపన పేరుతో డ్రామాలు ఆడి.. అత్తెసరు నిధులిచ్చి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన ఆయన తనదైన శైలిలో అబద్ధాలు..మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేశానంటూ క్రెడిట్ చోరీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులిచ్చి పనులు ప్రారంభిస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పనులు వేగవంతం చేసి ప్రాణం పోశారని, టన్నెళ్లను జాతికి అంకితం చేశారని జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు.


