ముంపు గ్రామాల్లో ఇక చీకట్లు | - | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాల్లో ఇక చీకట్లు

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

వెలిగొండ ముంపు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేతకు అధికారుల చర్యలు నేడు ప్రాజెక్టుకు నీటి విడుదల.. 11 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ తొలగింపు 1,200 వ్యవసాయ కనెక్షన్లు, 1200 గృహ కనెక్షన్లు, 100 కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు

మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీరు గ్రామాల వైపు వచ్చేలోపే విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలంలోని కలనూతల, సుంకేసుల, గుండంచర్ల, కాటంరాజుతండా, అక్కచెరువు తండా తదితర గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ తొలగించారు. ఇప్పటికే ప్రాజెక్టు ముంపు ప్రభావంతో ఆయా గ్రామాల ప్రజలు తమ ఇళ్లు, పంట పొలాలు, పశువులు, చిరకాల అనుబంధాలను వదిలి పునరావాస కేంద్రాలు, సమీప పట్టణాలు, గ్రామాలకు తరలిపోతున్నారు. తాజాగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుండటంతో ముంపు గ్రామాల్లో సాధారణ జనజీవనం పూర్తిగా ముగిసే దశకు చేరుకుంది.

1,200 వ్యవసాయ కనెక్షన్లకు ముగింపు

ముంపు గ్రామాల పరిధిలో సుమారు 1,200 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవసాయ కనెక్షన్లపై ఆధారపడి సుమారు రెండు వేల ఎకరాల్లో పత్తి మిర్చి, సజ్జ జొన్న కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో వ్యవసాయ బోర్లు, మోటార్లు, విద్యుత్‌ ఆధారిత సాగు వ్యవస్థలు ఉన్నాయి. గ్రామాలు ముంపునకు గురికానున్న నేపథ్యంలో వీటికి విద్యుత్‌ సరఫరాను నిలిపేయనున్నారు. ఇక సుమారు 1200 గృహ విద్యుత్‌ కనెక్షన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇళ్లను ఖాళీ చేసే ప్రక్రియ వేగవంతం కావడంతో గృహ విద్యుత్‌ సరఫరాను కూడా నిలిపేయనున్నారు. దీంతో ముంపు గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్‌ దీపాలు కనిపించని పరిస్థితి ఏర్పడనుంది.

100 ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపు

విద్యుత్‌ సరఫరా నిలిపేతతో పాటు గ్రామాల్లోని విద్యుత్‌ మౌలిక వసతులను కూడా తొలగిస్తున్నారు. సుమారు 40 వరకు 100 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లు, మరో 60 వరకు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నట్లు అంచనా. మొత్తం సుమారు 100 ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించనున్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న విద్యుత్‌ లైన్లకు సంబంధించిన సుమారు మూడు టన్నుల వరకు వైర్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముంపుతో విద్యుత్‌ పరికరాలు దెబ్బతినకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుగానే వీటిని తొలగించే చర్యలు చేపడుతున్నారు.

నీటి విడుదలకు ముందే చర్యలు

వెలిగొండ ప్రాజెక్టుకు నేడు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగే కొద్దీ ముంపు గ్రామాలపై ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్‌ సరఫరాను కొనసాగించడం ప్రమాదకరంగా మారుతుంది. దీంతో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలను తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్‌ సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఇల్లు ఖాళీ చేసినవారి గృహాల విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తున్నారు.

ఇంకా దక్కని పరిహారం:

ఒకవైపు ప్రాజెక్టుకు నీటి విడుదలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, మరోవైపు నిర్వాసితుల పరిహారం, పునరావాసం, ఉపాధి వంటి అంశాలపై ఇంకా కొన్ని కుటుంబాల్లో ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకముందే గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేయడంపై నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కరీంను వివరణ కోరగా ముంపు గ్రామాల్లో చివరి వ్యక్తి బయటకు వచ్చే వరకు విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తామని తెలిపారు. అయితే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సరఫరా నిలిపేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement