2019లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా పనులు ఆపకుండా 2021 నాటికే మొదటి టన్నెల్ను లైనింగ్తో సహా పూర్తి చేశారు. ఆయన హయాంలో రూ.1213 కోట్లు ఖర్చు చేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువ, ఉప కాలువలు, ఉదయగిరి ఉప కాలువ, పడమర కాలువ, టి–5 కాలువ పనులు పూర్తయ్యాయి. భూ సేకరణకు రూ.79.21 కోట్లు, పునరావాస కల్పనకు రూ.76.73 కోట్లు కేటాయించారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తాండ నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, చింతముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేసులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద, కలనూతలలో కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలను ఏర్పాటు చేశారు. ఇందులో సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, పాఠశాలలు నిర్మించారు. పునరావాస కాలనీలను కూటమి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అయితే ఈ కాలనీలను కూడా తానే ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం విని నిర్వాసితులు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండో టన్నెల్ను 2024 జనవరి నాటికే పూర్తి చేశారు. వెలిగొండ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1311 కోట్ల పరిహారం చెల్లించి, 2024 ఆగస్టు నాటికే నీళ్లు ఇవ్వాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారు.


