● ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు
మార్కాపురం: ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశించారు. సోమవారం మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 32 ప్రజలు అర్జీలు అందజేశారు. వాటిపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల్లో సివిల్, భూమి, ఆర్థిక తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు, పొదిలి, కంభం సీఐలు సురేష్, రాజేష్కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో 74 ఫిర్యాదులు...
ఒంగోలు సిటీ: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, పోలీస్ అధికారులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, వేధింపులు, తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ శ్రీహరి, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్రావు, సిబ్బంది పాల్గొన్నారు.


