సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంక సమీపంలో జిల్లా మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9963005209 నంబర్ను సంప్రదించాలన్నారు.
గిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో లారీ బోల్తాపడి నాలుగు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిన ఘటన మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో ఆదివారం జరిగింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపుగా వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డుకు అడ్డంగా బోల్తాకొట్టింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చి వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని పక్కకు తొలగించారు.
ఒంగోలు టౌన్: వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న కారణంగా మార్కాపురం, ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, సాధ్యమైనంత త్వరగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమం వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని వేళల్లో మార్పు చేసినట్లు కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని, అదేవిధంగా 1100 నంబర్కు ప్రజలు ఎవరైనా కాల్చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు.


