● డీఈఓ రేణుక
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్య పుస్తకాలు ఈనెల 8వ తేదీ నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు మొదటి దశలో సరఫరా చేసినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా మండల విద్యా వనరుల కేంద్రాలకు పుస్తకాల సరఫరాకు జెండా ఊపి డీఈఓ రేణుక, ఏటీఎం సయ్యద్ మెహబూబి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని తెలిపారు. ఒంగోలులోని పాఠ్యపుస్తకాల గోడౌన్కు 11 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని, వాటిని మొదటి విడతగా మండల కేంద్రాలకు పంపించినట్లు చెప్పారు.జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2.34 లక్షల మంది ఉన్నారన్నారు. జూన్ మొదటి వారంలోగా పుస్తకాలను బడులకు అందించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి.కిషోర్ బాబు, మేనేజర్ పేరయ్య, సీనియర్ అసిస్టెంట్ జిందా బాషా తదితరులు పాల్గొన్నారు.


