ఒంగోలు సబర్బన్: రొయ్య మేత ధరల పెంపుదల ప్రతిపాదన విరమించుకోవాలని రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ డిమాండ్ చేశారు. నగరంలోని కర్నూలురోడ్డులోని రొయ్య రైతుల సంఘ కార్యాలయంలో గురువారం రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం గోపీనాఽథ్ అధ్యక్షతన నిర్వహిచంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరలు పెంచాలని యాజమాన్యాలు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించి రొయ్యల రైతులపై ఖర్చులు భారం పడకుండా ఆదుకోవాలన్నారు. రొయ్యల మేత తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారి ప్రస్తుతం మేత తయారీ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే సాకును చూపి ఫీడ్ ధరలను పెంపుదల చేయాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరాయని గుర్తు చేశారు. దీన్ని ముఖ్యమంత్రి వెంటనే అనుమతి నిరాకరించి ధరల పెంపుదల ప్రయత్నాలను అడ్డుకొని రొయ్య రైతులపై పెట్టుబడి ఉత్పత్తి ఖర్చులు భారం పడకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం రొయ్యల రైతులకు ఉత్పత్తి ఖర్చులు పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదన్నారు. మరో వైపు రొయ్యలకు సంక్రమిస్తున్న వివిధ రకాల వైరస్ వల్ల చెరువుల్లో వేసిన రొయ్యలు చనిపోతూ తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల్లో వచ్చిన వ్యత్యాసాన్ని సాకుగా చూయించి రొయ్యల మేత ధరలను పెంచాలని చూడటం దారుణమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకసారి ధరలు పెంచారని, మళ్లీ ధరలు పెంచితే రొయ్య రైతులకు పెనభారంగా మారుతుందన్నారు. వాస్తవానికి ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు కంపెనీలు చెబుతున్నట్లుగా భారీ స్థాయిలో ఏం పెరగలేదన్నారు. పెరిగిన ధరలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, మళ్లీ ఫీడ్ ధరలు పెరిగితే రొయ్యల సాగుకు రైతులు దూరం కావాల్సి వస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోంచాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్ రెడ్డి ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు సీహెచ్ రమణయ్య, వి.వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రాము పాల్గొన్నారు.
రొయ్య రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు
దుగ్గినేని గోపీనాథ్


