ఒంగోలు వన్టౌన్: వృద్ధులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఒంగోలు నగరంలోని సమతా మహిళా వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల చట్టాలు, రక్షణ అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సమతా వృద్ధాశ్రమం నిర్వాహకులు అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


