రాష్ట్రంలో అరాచక పాలన
కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్..తిట్టినోళ్లకు సెంట్రల్ జెయిల్ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
పొదిలి రూరల్: రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న అరాచక పాలన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్.. తిట్టినోళ్లకు సెంట్రల్ జెయిల్ అన్నట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం పొదిలి శివాలయంలో నిర్మమహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డితో కలసి విలేకర్లతో మాట్లాడారు. మహాశివరాత్రి రోజున ఆ దేవదేవుడైన పరమేశ్వరుని అందరికీ మంచి జరిగేలా దీవించమని ప్రార్థించినట్లు చెప్పారు. ఒంగోలు పార్లమెంటులోని ముఖ్య దేవాలయాల్లోని స్వామివార్లకు ఆనవాయితీగా సారె తీసుకొచ్చి సమర్పించామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరిని జైల్లో పెట్టాలనే ఆలోచన తప్ప, అభివృద్ధి చేద్దామనే మాట గుర్తుకు రాదన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గ పాలన ఎక్కడైనా ఉంటుందా అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కే నరసింహారావు, జీ శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, మస్తాన్వలి, పులిగొర్ల శ్రీనివాసులు, ఫిరోజ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
త్రిపురాంతకంలో పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి
త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిపురాంతకం ఆలయాలకు వచ్చిన వారికి ఆలయాల వద్ద అధికారులు, వైఎస్సార్ సీపీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల చిత్రపటం, శేషవస్త్రం అందించారు. వారి వెంట పార్టీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, రంగబాబు, గాలెయ్య, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, శేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన


